Advertisement
మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు ఇతర అనేక దేశాల్లోనూ హిందువులు అనేక మంది ఉన్నారు. అలాగే ఇండోనేషియాలోనూ భారతీయులు.. అందులోనూ హిందువుల సంఖ్య ఎక్కువ. అది ముస్లిం దేశం అయినప్పటికీ అక్కడ మనకు హిందూ దేవాలయాలు కూడా కనిపిస్తాయి. అయితే ఇండోనేషియాకు చెందిన రూ.20వేల కరెన్సీ నోటుపై వినాయకుడి బొమ్మ కనిపిస్తుంది. కింద చిత్రంలో ఇచ్చింది అదే. అయితే ముస్లిం దేశం అయిన ఇండోనేషియాలో కరెన్సీ నోటుపై వినాయకుడి బొమ్మ ఎలా వచ్చిందనేది చాలా మందికి తెలియదు. కానీ దీని వెనుక రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. అవేమిటంటే…
Advertisement
ఇండోనేషియాను డచ్ వారు పరిపాలిస్తున్న రోజుల్లో కి హజర్ దేవంతర అనే వ్యక్తి స్వాతంత్య్రం కోసం పోరాటం చేసేవాడు. అయితే వినాయకుడు చదువును, జ్ఞానాన్ని ఇచ్చే దేవుడని ఆయనకు తెలిసింది. దీంతో ఆ చిత్రాన్ని విద్యార్థులు చూస్తే వారికి చదువు విలువ తెలుస్తుందని, తద్వారా దేశం కూడా అభివృద్ధి చెందుతుందని భావించాడు. ఈ క్రమంలో వినాయకుడి బొమ్మను ఆ నోటుపై ముద్రించడం మొదలు పెట్టారు.
ఇక 1997లో ఆసియా దేశాల కరెన్సీ విలువ అంతర్జాతీయ మార్కెట్లో బాగా తగ్గింది. దీంతో వినాయకుడి బొమ్మను నోట్లపై ముద్రిస్తే మంచి జరుగుతుందని భావించిన ఆ దేశ నేతలు అలాగే చేశారు. ఈ క్రమంలో ఇండోనేషియా కరెన్సీ విలువ పెరిగింది. అందుకనే ఆ తరువాత కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆ నోట్లపై వినాయకుడి బొమ్మను ముద్రిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు లభిస్తున్న కొత్త నోట్లపై వినాయకుడి బొమ్మలు లేవు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఆ కరెన్సీ నోట్లకు చెందిన ఫొటోలను కొందరు షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.
Advertisements