Advertisement
దేశంలో రోజు రోజుకీ సైబర్ నేరగాళ్ల మోసాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. జనాల డబ్బులను దోచుకునేందుకు వారు కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. ఇక ప్రస్తుతం కోవిడ్ 19 నేపథ్యంలో డిజిటల్ ట్రాన్సాక్షన్లు బాగా పెరిగాయి. దీంతో ఇదే అదునుగా భావించిన నేరస్థులు జనాలను పెద్ద ఎత్తున టార్గెట్ చేశారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాలు, కార్డుల సమాచారాన్ని ఇతరులకు ఎవరికీ ఇవ్వరాదని, బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించేటప్పుడు సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.
ఇక బ్యాంకింగ్ కస్టమర్లకు సంబంధించి వారి ఖాతాల్లో ఏవైనా ఫ్రాడ్ లావాదేవీలు జరిగితే వెంటనే 14440 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆర్బీఐ సూచించింది. దీని వల్ల వినియోగదారులు తమకు కలిగే నష్టం నుంచి తప్పించుకోవచ్చని తెలిపింది. అలాగే కేవైసీ చేస్తామని, బ్యాంక్, ఫైనాన్స్ కంపెనీల నుంచి కాల్ చేస్తున్నామని.. వచ్చే ఫోన్ కాల్స్ను ఎట్టి పరిస్థితిలో నమ్మకూడదని ఆర్బీఐ సూచించింది.
ఆర్బీఐ దేశంలోని బ్యాంకింగ్ కస్టమర్లకు లావాదేవీల పట్ల సురక్షితంగా ఉండడం కోసం పలు సూచనలు జారీ చేసింది.
Advertisement
- వినియోగదారులు ఎట్టి పరిస్థితిలోనూ తమ ఏటీఎం, డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డుల పిన్ వివరాలను ఇతరులకు చెప్పరాదు.
- ఆయా ఖాతాలకు చెందిన పాస్వర్డ్లు, పిన్, ఓటీపీ, సీవీవీ, యూపీఐ-పిన్ వివరాలను కూడా ఇతరులకు చెప్పరాదు.
- పబ్లిక్, ఓపెన్ లేదా ఫ్రీ వైఫై నెట్వర్క్లను వాడేటప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించరాదు.
- స్మార్ట్ఫోన్లు, ఈ-మెయిల్స్, వాలెట్ లేదా పర్సులలో బ్యాంకింగ్ సమాచారాన్ని స్టోర్ చేయరాదు.
- వినియోగదారులకు చెందిన బ్యాంకింగ్ పాస్వర్డ్లు, పిన్, ఓటీపీ, కార్డుల సీవీవీ నంబర్లు ఇతర వివరాలను తెలియజేయాలని బ్యాంకులు ఎట్టి పరిస్థితిలోనూ ఫోన్ కాల్స్ చేయవు. ఇలా వచ్చే కాల్స్కు స్పందించకూడదు.
ఇక ఇవే కాకుండా వినియోగదారులకు ఈ-మెయిల్స్, సోషల్ మీడియా పోస్టులు, ఇతర మాధ్యమాల్లో వచ్చే వెబ్సైట్, యాప్ లింకులను అస్సలు ఓపెన్ చేయరాదు. చేస్తే ఫోన్ లేదా కంప్యూటర్ హ్యాకింగ్ బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. దీంతో విలువైన సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. దీంతో అనర్థాలు సంభవిస్తాయి. కాగా ఎస్బీఐ కూడా ఇటీవలే తన కస్టమర్లకు ఓ హెచ్చరిక జారీ చేసింది. ఉచితంగా కరోనా టెస్టులు చేస్తామంటూ కొందరు దుండగులు ncov2019@gov.in అనే మెయిల్ నుంచి మెయిల్స్ పంపిస్తున్నారని, వీటిని అస్సలు ఓపెన్ చేయరాదని ఎస్బీఐ సూచించింది.
Advertisements
Attention! It has come to our notice that a cyber attack is going to take place in major cities of India. Kindly refrain yourself from clicking on emails coming from ncov2019@gov.in with a subject line Free COVID-19 Testing. pic.twitter.com/RbZolCjLMW
— State Bank of India (@TheOfficialSBI) June 21, 2020
Advertisements
ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్లలో ఉండే పౌరులు సైబర్ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా ఎస్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్ 19 పేరిట కొందరు వినియోగదారులను మోసం చేసేందుకు పెద్ద ఎత్తున యత్నిస్తున్నారని, సైబర్ దాడులు కూడా జరిగేందుకు అవకాశం ఉందని నిఘా వర్గాలు సైతం ఇప్పటికే హెచ్చరించాయి. అందువల్ల బ్యాంకింగ్ కస్టమర్లు ఈ విషయాలపై అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ సూచిస్తోంది.